B Vinod Kumar | కళాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సకల కళలను ఆదరిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మంగళవారం ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో నటరాజ్ అకాడమీ, మాంగళ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘కేసీఆర్ ఉండగా.. ప్రతి రోజూ కళా పండుగే’ అన్న నినాదంతో జానపద కళాకారుల మహా ర్యాలీని వినోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కళలను, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదరిస్తోందని అన్నారు.
ముఖ్యంగా జానపద కళలు కనుమరుగు కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కొమురవెల్లి తదితర ప్రధాన ఆలయాల్లో సాయంత్రం పూట భక్తుల కోసం కళా రూపాలను ప్రదర్శించేందుకు జానపద కళాకారులకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కళాకారుల పాత్ర మరువలేనిదని అన్నారు. కళాకారులను ఆదుకునేందుకు సాంస్కృతిక సారథి సంస్థ ద్వారా సీఎం కేసీఆర్ ఉపాధిని కల్పించారని వినోద్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, ర్యాలీ నిర్వాహకులు బత్తిని కీర్తిలతా గౌడ్, గిరి, శరత్ చంద్ర, గడ్డం శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.