హైదరాబాద్ : రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మాటలు నీటి మూటలేనని, ఆయన హయాంలో రైతుల ఆదాయం మరింత దిగజారిందన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించనున్న దీక్ష ఏర్పాట్లను ఎంపీలు కేఆర్ సురేష్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల స్థితిగతులపై, కేంద్ర బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ 2016 ఫిబ్రవరిలో ప్రకటించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుల ఆదాయం విషయం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
మోదీ మాటలు అమలుకావడం లేదన్న విషయాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికతో స్పష్టం చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరితో దేశంలో రైతుల ఆదాయం మరింత దిగజారిపోయిందన్నారు. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గతకొంతకాలంగా పలు రూపాల్లో టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని, సోమవారం ఢిల్లీలో దీక్ష చేపట్టి కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచుతామని వినోద్కుమార్ పేర్కొన్నారు.
ఢిల్లీ దీక్షలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అన్ని శ్రేణుల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు దేశ రాజధానికి చేరుకున్నారన్నారు. రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఎలా ఉండాలో పార్టీ అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారన్నారు. రాష్ట్రంలో రైతులకు పుష్కలంగా నీళ్లు, విద్యుత్ అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు.