కార్పొరేషన్, ఫిబ్రవరి 21 : అగ్ని ప్రమాద బాధితులను)Fire victims) ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్(Karimnagar) మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్(Vinod Kumar )కోరారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక ఏమైనా కుట్ర కోణం ఉన్నదా..? అన్న కోణంలో పోలీసులు పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ 42వ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్, ఆదర్శనగర్ మధ్య మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగి గుడిసెలు బుగ్గి కాగా, బుధవారం బాధితులను ఆయన పరామర్శించారు.
ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ అవసరాల కోసం లక్ష ఆర్థిక సాయం అందించారు. అధైర్య పడొద్దని, పేదలను ఆదుకునేందుకు అన్ని విధాలుగా సాయం చేస్తామని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించి తగిన న్యాయం చేయాలని కోరారు. బాధితులకు వెంటనే తాత్కలికంగా నివాసాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.
అందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. ముప్పై ఏండ్లుగా ఈ నిరుపేదలు ఇక్కడే జీవిస్తున్నారని, గతంలో చాలా మంది వచ్చి ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని వారిని ప్రలోభాలకు గురి చేశారని పేర్కొన్నారు. కూలీల గుడిసెలు అగ్నిప్రమాదంలో దగ్ధం కావడం బాధకరమని ఆవేదన చెందారు.
పేదలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని మేయర్ సునీల్రావు, స్థానిక కార్పొరేటర్ వనజ అశోక్రావుకు సూచించారు. ప్రమాద శకలాలను తొలగించి నివాసం ఉండేలా చూడాలన్నారు. ఆయన వెంట మేయర్ సునీల్రావు, స్థానిక కార్పొరేటర్ వనజ అశోక్రావు, బీఆర్ఎస్ నాయకులు జక్కుల నాగరాజు, పెండ్యాల మహేశ్ కుమార్ పాల్గొన్నారు.