హైదరాబాద్: ఆసరా పింఛన్ల పథకం ఓట్ల కోసం పెట్టింది కాదని, ఓట్లేయకపోతే పింఛన్లు ఎందుకు ఆపేస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎన్నికలు, ఓట్లే లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేయదని, తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. హుజూరాబాద్లో పార్టీ నేతలతో కలిసి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పథకాలు ఎత్తేస్తారని బీజేపీ అబద్దాలు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. నీళ్లు తీసుకొస్తామని చెప్పాం.. తీసుకొచ్చి చూపించామన్నారు. గతంలో అర్ధరాత్రి కరెంట్ ఇస్తే రైతులు ఎంత గోస పడ్డారో తెలుసున్నారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు.
రూ.200 ఉన్న పెన్షన్ను రూ.2016కు పెంచి ఇస్తున్నామని, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని చెప్పారు. ఓట్లేయకపోతే పింఛన్లు ఎందుకు ఆపేస్తామని ప్రశ్నించారు. పెట్టుబడి కోసం రైతులు ఎవరిపై ఆధారపడొద్దని ఇస్తున్నదే రైతుబంధని, రైతు చనిపోతే కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు రైతు బీమా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచంలో రైతు బీమా ఎక్కడా లేదన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీళ్లు ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇవన్నీ కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ఈ పథకాల్లో కేంద్రం ఇచ్చే రూపాయి ఉందా చూపించాలని డిమాండ్ చేశారు.
దళితబంధు పథకానికి 2002లోనే ఆలోచన చేశామన్నారు. దళిత్ ఎంపర్మెంట్ కింద సీఎం ఫిబ్రవరిలోనే రూ.వెయ్యి కోట్లు బడ్జెట్లో కేటాయించారని చెప్పారు. నెలాఖరు వచ్చిందంటే అప్పులు, కిస్తీలు కట్టాలనే భయం లేకుండా ఒకేసారి గ్రాంట్ రూపంలో దళితులకోసం సీఎం కేసీఆర్ దళితబంధు తెచ్చారని చెప్పారు.