హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, పచ్చదనం పెంపు నిత్యజీవితంలో భాగంకావాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. వినాయకచవితి సందర్భంగా గ్రీన్ ఇండియాచాలెంజ్ విత్తన గణేశ ప్రతిమల పంపిణీని చేపట్టింది. హైదరాబాద్ పంజాగుట్ట సమీపంలోని నెక్ట్స్ గలేరియా మాల్లో ఎంపీ సంతోష్కుమార్ సోమవారం లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల్కు వచ్చిన సందర్శకులకు విత్తన గణపతులను పంపిణీచేశారు. స్వచ్ఛమైన మట్టి, కొబ్బరినాచుతో ప్రతిమలను తయారుచేసినట్టు గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వాహకులు తెలిపారు. హరిత తెలంగాణ సాధనలో భాగంగా చింత, వేప మొక్కలను విరివిగా పెంచాలన్న సీఎం కేసీఆర్ ఆశయం మేరకు ఆ విత్తనాలతో మట్టి గణేశులను తయారుచేసి పంపిణీ చేస్తున్నట్టు ఎంపీ సంతోష్కుమార్ వెల్లడించారు. కాలుష్యం తద్వారా జరుగుతున్న పర్యావరణ నష్టాన్ని తగ్గించాలన్న తలంపుతో విత్తన గణపతుల పంపిణీకి గ్రీన్ ఇండియా చాలెంజ్ ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రతిఏటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేతకాని, గో రూరల్ సంస్థ సీఈవో సునీల్, టీన్యూస్ సీజీఎం ఉపేందర్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కోఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.