నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 30: రాష్ట్రంలో కరోనాతో ఉక్కిరిబిక్కిరయిన పల్లెలు సర్కారు చేపట్టిన జ్వర సర్వేతో ఊపిరిపీల్చుకున్నాయి. అప్పటిదాకా కనిపించిన కేసులు తగ్గుముఖం పట్టాయి. ఎన్నో ఊళ్లు ఒక్క కేసు కూడా లేకుండా వందశాతం రికవరీ సాధించాయి. ఇదంతా జ్వర సర్వే పుణ్యమేనని స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటికొచ్చి పరీక్షలు చేయడమే కాదు, లక్షణాలు కనిపిస్తే మందులు ఉచితంగా అందజేయడం, అవగాహన కల్పించడం వల్లే కరోనా కట్టడి సాధ్యమైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సుంకరగూడెంలో సున్నా కేసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు మండలం మామిడిగూడెం పంచాయతీ పరిధిలో అడవికి దగ్గరగా సుంకరగూడెం ఉన్నది. గ్రామ జనాభా 248. జ్వర సర్వే ఆ గ్రామం కరోనా మహమ్మారిని జయించేలా చేసింది. సర్వే ద్వారా పాజిటివ్గా నమోదైన 17 మందితోపాటు మరో నలుగురిని అనుమానితులుగా గుర్తించారు. వైద్య సిబ్బంది.. బాధితులకు సలహాలు, సూచనలిచ్చారు. మందులు అందజేశారు. రోజూ బాధితులతో మాట్లాడి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. ప్రతి కుటుంబానికి 30 కోడిగుడ్లు, నిత్యావసరాలు అందజేశారు. వారు గడప దాటకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. రెండు, మూడు దశల్లో నిర్వహించిన జ్వర సర్వేలో గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
కోలుకున్న కజ్జర్ల
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్లలో ఇటీవల నిర్వహించిన జ్వర సర్వేలో 52 మందికి కొవిడ్ లక్షణాలున్నట్టు గుర్తించారు. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి మందులు పంపిణీ చేశారు. దీంతో ఐదారు రోజుల్లోనే 52 మందికి జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు తగ్గాయి. రెండో విడుత సర్వే నిర్వహించగా ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ పంచాయతీ జనాభా 4,136. మొదట దశ జ్వరసర్వేలో కరోనా లక్షణాలున్న 9 మందిని గుర్తించారు. వెంటనే మెడికల్ కిట్లు అందజేశారు. దీంతో అందరూ కోలుకున్నారు. రెండోసారి సర్వే నిర్వహించగా.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కరోనా కట్టడిలో సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల గ్రామం ఆదర్శంగా నిలిచింది. జనాభా 3,004 ఉండగా.. ఇక్కడ 42 మంది కరోనా బారినపడ్డారు. జ్వర సర్వే చేసి వైద్య సిబ్బంది వెంటనే మందులు అందజేశారు. మూడు విడుతలుగా గడప గడపకు తిరిగి ప్రజల్లో అవగాహన కల్పించారు. గ్రామంలో 39 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మూడే కేసులున్నాయి.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో 1,200 ఇండ్లకుగాను జనాభా 4,557 ఉన్నది. ఏప్రిల్ 26న 22 మందికి కరోనా పరీక్షలు చేస్తే 11 మందికి పాజిటివ్గా తేలింది. మే 6న ఒకరు, మే 18న మరొకరు కొవిడ్తో మృతిచెందడంతో పక్క ఊరు వాళ్లు సైతం ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో ప్రభుత్వం జ్వర సర్వే ప్రారంభించింది. మొదటి విడుతలో 15 మందికి, రెండో విడుతలో 20 మందికి కిట్లను అందించింది. ప్రస్తుతం ఇక్కడ కరోనా కేసులు 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.
జ్వర సర్వేలో భాగంగా నల్లగొండ జిల్లా అనుముల మండలంలో 486, త్రిపురారంలో 240, పెద్దవూరలో 124, నాగార్జున సాగర్లో 275, గుర్రంపోడు మండలంలో 69, నిడమనూరు మండలంలో 457 మందికి మందులు అందించారు. కరోనా లక్షణాలున్నవారిని దవాఖానకు పంపించారు. హోం క్వారంటైన్లో ఉన్నవారి ఇండ్లకు వైద్య ఆరోగ్య సిబ్బంది నిత్యం వెళ్లి మాత్రలను అందజేసి ధైర్యం చెప్పడంతో ప్రస్తుతం 99 శాతం మంది రికవరీ అయ్యారు.
నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం తూటిపేటతండా పరిధిలోని గాత్తండాలో 35 మంది గిరిజనులు కరోనా బారినపడ్డారు. ఈ నెల రెండో వారంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వేచేసి వారిని హోం క్వారంటైన్లో ఉంచారు. 30 మంది పూర్తిగా కోలుకోగా.. మిగతావారు కోలు కుంటున్నారు.