కరోనా సెకండ్ వేవ్తో విలవిల్లాడిన పల్లెలు ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాయి. నెల క్రితం గ్రామాల్లో విలయతాండవం చేసిన వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఏ గ్రామానికి ఆ గ్రామం సొంతంగా లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ, మాస్క్ లేకుంటే ఫైన్ తదితర కట్టుబాట్లతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేశాయి. దీంతో మొన్నటిదాకా వందల్లో కేసులు నమోదుకాగా, ఇప్పుడు ఆ సంఖ్య పదికి తగ్గిపోయింది. స్థానిక వైద్యులు, పోలీసులు, పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పల్లె ప్రజలు తమ గ్రామాల నుంచి కరోనాను తరిమికొడుతున్నాయి. కరోనాపై పోరులో దీటుగా పోరాడుతున్న గ్రామాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ)
అది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మోతీపటార్ గ్రామం.. మార్చి చివర్లో ఓ గిరిజన తెగ ఇక్కడ హోలీ పండుగను ఘనంగా నిర్వహించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి ఈ వేడుకకు దాదాపు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. ఏప్రిల్ 5న మోతీపటార్ పక్కనున్న కొత్తపల్లిలో ముగ్గురికి కరోనా సోకింది. మరుసటి రోజు మరో 8 మంది టెస్ట్ చేయించుకొంటే అందరికీ పాజిటివ్ వచ్చింది. ఇలా ఆ గ్రామంలో 132, మోతీపటార్లో 89, పట్కల్మంగీ 14, పిక్లతాండ 96, వంకమద్ది 74 మొత్తం కలిపి 405 కేసులు వచ్చాయి. దీంతో ఈ పల్లెలన్నీ ఏకమయ్యాయి. పోలీసుల సహాయంతో ప్రతి గ్రామంలో కట్టడి చర్యలు చేపట్టాయి. గ్రామస్థులెవరూ బయటికి వెళ్లకుండా, కొత్త వ్యక్తులు ఈ ఊళ్లలోకి రాకుండా కట్టడి చేశారు. కోవిడ్ సోకిన వారిని కుటుంబంతో సంబంధం లేకుండా ప్రత్యేక గదుల్లో ఉంచారు. స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రజలకు కూరగాయలు, నిత్యావసరాలు అందించారు. ఈ చర్యలతో ఒక్క మరణం కూడా సంభవించకుండా ఐదు గ్రామాల్లోని 405 మంది పూర్తిగా కోలుకున్నారు. వరంగల్ రూరల్ జిల్లా గవిచర్లలోనూ గతనెల 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వెంటనే అప్రమత్తమైన గ్రామ పెద్దలు, అధికారులు పది రోజుల పాటు గ్రామంలో లాక్డౌన్ ప్రకటించారు. కిరాణా దుకాణాలు, కూరగాయల షాపులకు మాత్రమే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అనుమతిచ్చారు. మాస్క్ లేకుండా బయటికి వచ్చే వారికి రూ.1000 జరిమానా విధిస్తామనే నిబంధన పెట్టారు. పోలీసుల సహాయంతో కట్టదిట్టమైన చర్యలు చేపట్టారు. పదిరోజుల్లోనే 60 మందికిపైగా కోలుకొన్నారు. మిగిలిన 20 మంది ప్రైవేటు దవాఖానలు, ఇండ్లలో ఐసొలేషన్లో ఉన్నారు. మరో పదిరోజులపాటు గ్రామంలో ఇలాంటి నిబంధనలే అమలు చేసి కరోనారహితంగా తీర్చిదిద్దుకొంటామని ఆ గ్రామస్థులు చెబుతున్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపుర్ మండలంలోని గొల్లపల్లిలోనూ ఏప్రిల్ మొదటి వారంలో కరోనా విలయతాండవం చేసింది. మూడు రోజుల వ్యవధిలోనే 50 మందికి పాజిటివ్ నిర్ధారణైంది. దీంతో పంచాయతీ పాలకవర్గం 7వ తేదీ నుంచి 22వ తేదీ వరకు లాక్డౌన్ విధించింది. ప్రజాప్రతినిధులు, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితులకు గుడ్లు, డ్రైప్రూట్స్, నిత్యావసరాలు పంపిణీ చేశారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇచ్చిన మెడికల్ కిట్లను వినియోగించి, వారు చెప్పిన జాగ్రత్తలను పాటించారు. ప్రస్తుతం 44 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మిగిలిన వారు హోం ఐసొలేషన్లో చికిత్స పొందుతున్నారు.
పక్కనే ఉన్న మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంటే ఆ గ్రామంలో మాత్రం ఒక్క పాజిటివ్ కేసు రాలేదు. అదే నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పల్సితండా. మహారాష్ట్రకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ ఏడాదిగా శుభకార్యాలకు దూరంగా ఉంటున్నది. గ్రామస్థులు ఉదయం, సాయంత్రం మాత్రమే వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఆ గ్రామస్థులకు ఉన్న మంచి ఆహారపు అలవాట్లు, ప్రతి ఇంటి ముందున్న వేపచెట్లు వారికి మేలు చేస్తున్నాయి. దీనికితోడు గ్రామంతో ప్రతి రోజు శానిటేషన్ చేస్తున్నారు. మాస్క్ లేకుండా ఏ ఒక్కరూ బయట కనిపించరు. అందుకే కరోనా రహిత గ్రామంగా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నదీ పల్సితండా.