రాయపర్తి, జూన్ 22: గ్రామాల్లో అపరిచితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్ కోరారు. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఏసీపీ సారథ్యంలో ఎస్సై బండారి రాజు నేతృత్వంలో సుమారు 30 మంది పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహించారు. బెల్డ్ షాపులు, కిరాణా దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యం సీసాలు, గుట్కాలు, అంబర్ ప్యాకెట్లు, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామస్తులతో ఏసీపీ రమేశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.
గ్రామాల్లో అనుమానితుల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. నిషేధిత ఉత్పత్తులు, మత్తుపదార్థాలు, వస్తు సామగ్రి రవాణా, క్రయ విక్రయాలపై పోలీసులు నిఘా పెంచుతున్నట్లు వెల్లడించారు. సమాజంలోని ప్రతి వ్యక్తి యూనిఫాం లేని పోలీస్గా వ్యవహరించినప్పుడే శాంతిభద్రతలకు విఘాతం కలుగదన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఉద్యోగాలు సాధించేందుకు పోటీపడి చదువు కోవాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ సదన్కుమార్, ఎస్సై మాధవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.