హైదరాబాద్: మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో 12 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) నుంచి గెలుపొందినవారిలో అత్యధికులు కొత్తవారే కావడం, విజయం సాధించిన సీనియర్లను మంత్రి పదవులు వరించడంతో.. అసెంబ్లీ స్పీకర్గా ఎవరిని ఎన్నుకుంటారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
అయితే దీనికి ఫుల్స్టాప్ పెడుతూ.. వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ను (Gaddam Prasad Kumar) పార్టీ అధిష్ఠానం స్పీకర్గా ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. ఎస్సీ కోటాలో గెలుపొందినవారిలో దామోదర రాజనర్సింహ, ప్రసాద్ కుమార్ సీనియర్లు. రాజనర్సింహ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. దీంతో స్పీకర్ పదవిని ప్రసాద్ కుమార్ చేపట్టడం ఇక లాంఛనమే కానుంది.