బర్రె పాలకు లీటర్కు రూ.4.68
ఆవు పాలకు రూ. 2.88 పెంపు
మంత్రి తలసాని వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 22 : విజయ డెయిరీ మరోసారి పాల సేకరణ ధరను పెంచింది. రైతుల నుంచి సేకరించే బర్రె పాలకు లీటర్కు రూ.4.68, ఆవు పాలకు రూ.2.88 చొప్పున పెంచుతున్నట్టు పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయం మార్చి 1న చెల్లించే బిల్లుల నుంచి వర్తిస్తుందని తెలిపారు. దీనితో రైతుల నుంచి సేకరించే బర్రె పాల ధర లీటర్కు రూ.36.99 నుంచి రూ.41.64కు పెరుగనున్నది. ఆవు పాల సేకరణ ధర రూ.29.76 నుంచి రూ.32.64కు పెరుగనున్నది. పాల సేకరణ ధర పెంపుతో రాష్ట్రంలోని సుమారు 3 లక్షల పైచిలుకు విజయ పాడి రైతులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తలసాని తెలిపారు. పాడి రైతులకు ప్రోత్సాహకం కింద లీటర్కు రూ.4 చొప్పున రూ.343 కోట్లకు పైగా చెల్లించినట్టు వివరించారు.