వరంగల్ : కేసీఆర్ దిక్షా దివస్ సందర్భంగా వరంగల్ నగర పరిధి దేవన్నపేట శివారులో విజయగర్జన సభను నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 29న సుమారు 10 నుంచి 12 లక్షల మందిని సమీకరించి భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అందులో భాగంగా దేవన్నపేట శివారులో స్థలాన్ని సేకరించి పనులను ప్రారంభించారు. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంగళవారం పంచాయతీరాజ్ సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులు పనులను పరిశీలించారు.
సభ కోసం మూడు వందల ఎకరాలకు పైగా..పార్కింగ్ కోసం బహిరంగ సభ ప్రాంగణం చూట్టూ సుమారు 15 వందల ఎకరాల స్థలాన్ని సేకరించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సీఎం కేసీఆర్ వరంగల్ నగరాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
పార్టీ స్థాపించి 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు నివేదించనున్నారు.