హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ చరిత్రలో కొత్త అధ్యాయానికి తొలి అడుగు పడుతున్నది. రాష్ట్రంలో పాలు, పాల ఉత్పత్తుల పెంపుదలే లక్ష్యంగా మెగా డెయిరీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో అంతర్జాతీయస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న మెగా డెయిరీకి శుక్రవారం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ భూమిపూజ చేయనున్నారు. 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో దీనిని నిర్మించనున్నారు. రెండేండ్లలో నిర్మాణం పూర్తి చేసి, ఉత్పత్తుల తయారీ ప్రారంభించాలన్నది లక్ష్యం. డెయిరీ నిర్మాణంలో విశేష అనుభవం ఉన్న నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)కు నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇది అందుబాటులోకి వస్తే రోజువారీ పాల ఉత్పత్తి సామర్థ్యం 8 లక్షల లీటర్లకు పెరుగుతుంది. ప్రస్తుతం లాలాపేటలో ఉన్న విజయ ప్లాంట్కు రోజుకు 3.5 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఉన్నది. మెగా డెయిరీతో పాలఉత్పత్తి సామర్థ్యం రెండు నుంచి మూడు రెట్లు పెరిగి, మరికొన్ని రకాల ఉత్పత్తులను భారీఎత్తున చేపట్టే అవకాశం లభిస్తుంది. 75 వేలమంది పాడి రైతులకు సభ్యత్వం ఉన్న విజయ డెయిరీ.. పీక్ సీజన్లో రోజుకు 4.5 లక్షల లీటర్లు, వేసవిలో 2.5 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నది. మెగా డెయిరీ వస్తే.. మరింత మంది పాడి రైతులకు లబ్ధిచేకూరనున్నది.
మెగా విశేషాలు
డెయిరీ విస్తీర్ణం :40 ఎకరాలు
నిర్మాణ ఖర్చు : రూ.250 కోట్లు
రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం..
పాలు 8 లక్షల లీటర్లు
టెట్రా ప్యాకెట్లు లక్ష
ఐస్క్రీమ్ 5 వేల లీటర్లు
నేడు మార్కెట్లోకి 14 రకాల స్వీట్లు
విజయ బ్రాండ్ పేరుతో శుక్రవారం నుంచి 14 రకాల స్వీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. గులాబ్జామ్, రాగి, బేసన్, మలాయ్, జోవర్, మల్టీమిల్లెట్ లడ్డులు, సున్నుండలు, బాదంహల్వా, కాజూకట్లీ, చాకోబర్ఫీ, సోన్పాప్డీ వంటి స్వీట్లను అందుబాటులోకి తీసుకురానున్నది. పాలు, పాల ఉత్పత్తులతోపాటు ఇప్పటికే 57 రకాల ఉత్పత్తులను విజయ బ్రాండ్తో విక్రయిస్తున్నారు. ఇటీవలే ఐస్క్రీం ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. మెగా డెయిరీ నిర్మాణం పూర్తయితే రోజుకు 5 వేల లీటర్ల ఐస్క్రీమ్లను తయారుచేసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటుంది. దీంతో పాటు లక్ష టెట్రా పాల ప్యాకెట్ల తయారీని కూడా ప్రారంభించనున్నది.
నాడు అప్పులు.. నేడు లాభాలు
ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వ విధానాల కారణంగా విజయ డెయిరీ అప్పుల్లో కూరుకుపోయి, పతానవస్థకు చేరింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని దశ తిరిగింది. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చిన సీఎం కేసీఆర్.. విజయ డెయిరీకీ పూర్తి సహకారం అందజేశారు. దీంతో ఇప్పుడు రూ.750 కోట్ల టర్నోవర్ సాధించింది. 600 ఔట్లెట్లతో విజయ ఉత్పత్తులను విక్రయిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నది.
విజయ చరిత్రలో నూతన అధ్యాయం
మెగా డెయిరీ నిర్మాణంతో విజయ డెయిరీ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతున్నది. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 57 రకాల ఉత్పత్తులను అందిస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే విజయ డెయిరీ అభివృద్ధి పథంలో నడుస్తున్నది. పాడి రైతులకు మరింత మేలు చేసేలా చర్యలు తీసుకుంటాం.