హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)/హయత్నగర్: రైతుల నుంచి సేకరిస్తున్న పాల ధరను విజయ డెయిరీ పెంచింది. 5 శాతం వెన్న ఉన్న బర్రె పాలపై లీటరుకు రూ.4, 3 శాతం వెన్న ఉన్న ఆవు పాలపై రూ.4.6 పెరిగింది. బర్రె పాల ధర లీటరుకు (ప్రభుత్వం ఇచ్చే రూ.4 ఇన్సెంటివ్తో కలిపి) రూ.40.50 నుంచి రూ.44.05, ఆవు పాల ధర లీటరుపై రూ.39.65 నుంచి రూ.44.25 చేసింది. ఈ ధరలు ఈ నెల 15న ఇచ్చే బిల్లులతో కలిపి ఇవ్వనున్నది. ఈ మేరకు విజయ డెయిరీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్య కాలంలోనే విజయ పాల సేకరణ ధర పెంచడం ఇది రెండోసారి. పాల ధర పెంపుపై పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల రైతుల నుంచి సేకరిస్తున్న పాల ధర పెంచుతూ మదర్ డెయిరీ బోర్టు నిర్ణయం తీసుకున్నదని చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డి తెలిపారు. బర్రె పాలు (6శాతం) లీటరు రూ.45 నుంచి రూ.51, ఆవు పాలు (3శాతం) లీటరు రూ.35.70 నుంచి రూ.40.25 చేసినట్టు తెలిపారు. రైతులను ప్రోత్సహించేందుకు ప్రస్తుత ధరకు అదనంగా ఇన్సెంటివ్ రూపంలో చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. ఇది ఈ నెల 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు.