హైదరాబాద్,సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో నిర్మించిన విజయ డెయిరీ మెగాప్లాంట్ను అక్టోబర్ 5న ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన విజయ డెయిరీ బోర్డు సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. రూ.250 కోట్ల వ్యయం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోజుకు 5 నుంచి 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఈ డెయిరీని నిర్మించినట్టు వివరించారు. దీంతో విజయ ఉత్పత్తుల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
మారెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు మరిన్ని విజయ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్సిన్హాను ఆదేశించారు. రైతుల నుంచి పాలసేకరణ, రవాణ, మారెటింగ్ తదితర కార్యకలాపాలను సులువుగా నిర్వహించేందుకు రాష్ట్రంలో ఆరు జోన్లను ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు విజయపాలను సరఫరా చేసే విధంగా ఆ శాఖకు చెందిన అధికారులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తీవ్ర నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ ప్రస్తుతం రూ.800 కోట్ల టర్నోవర్ను అధిగమించిందని వివరించారు.
పాడి పరిశ్రమ రంగంలోని రైతులను ప్రోత్సహించేందుకు లీటర్ పాలకు రూ.4 నగదు ప్రోత్సాహకం, సబ్సిడీపై పాడిగేదెలను అందిస్తున్నట్టు తెలిపారు. లాలాపేట డెయిరీలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు బిల్లుల భారాన్ని తగ్గించుకొనేందుకు సోలార్ విద్యుత్తు వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. విజయ డెయిరీ బ్రాండ్తో నకిలీ ఉత్పత్తులను మారెటింగ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డెయిరీ చైర్మన్ సోమా భరత్కుమార్గుప్తా, పశు సంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్సిన్హా తదితరులు పాల్గొన్నారు.