యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 3: యాదగిరిగుట్ట ఆలయ శిల్పకళా ఎంతో అద్భుతంగా ఉన్నదని, చోళ, పల్లవ, కాకతీయ శైలి నిర్మాణాలు కనువిందు చేస్తున్నాయని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ప్రశంసించారు. ఇంతగొప్పగా యాదాద్రిని పునర్నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం కుటుంబసభ్యులతోపాటు ‘ఖుషి’ సినిమా దర్శకుడు శివ నిర్వాన, నిర్మాతలు రవి, నవీన్, చిత్ర బృందంతో కలిసి స్వయంభూ పంచనారసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం చేశారు. ఈవో గీత స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
విశాలంగా ఆలయ మాఢవీధులు
గతంలో పోలిస్తే ఆలయం ఎంతో విశాలం గా రూపుదిద్దుకున్నదని విజయ్ దేవరకొండ చెప్పారు. ఆలయ మాఢవీధులు విశాలంగా మారాయని, భక్తుల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. తమ కుటుంబానికి ఈ ఏడాది ఎంతో కలిసి వచ్చిందని, స్వామివారికి మొక్కు తీర్చేందుకు వచ్చామని చెప్పారు. 12 ఏండ్ల క్రితం డిగ్రీ చదువుకొనే రోజుల్లో స్వామివారి దర్శనానికి వచ్చానని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు ఇంత అందమైన గుడిని కట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబానికి, మైత్రి మూవీ మేకర్స్కు ఇది చాలా గొప్ప సంవత్సరమని పేర్కొన్నారు. మైత్రి మూవీ మేకర్స్కు రెండు జాతీయ అవార్డులు వరించాయని తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్టు వెల్లడించారు. విజయ్ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా హీరోలను చూసేందుకు భక్తులు, అభిమానులు పోటెత్తారు. సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.