వేములవాడ, జూలై 25: వేములవాడ రాజన్న ఆలయంలో మంగళవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం తనిఖీ చేసింది. ప్రసాదాల తయారీలో వినియోగించే దిట్టం కాజు, కిస్మిస్, శర్కర, నెయ్యి నాణ్యతా ప్రమాణాలను అధికారులు పరిశీలించారు. ప్రతి పదార్థాన్ని తూకం వేసి చూశారు. కోడెల టికెంట్ బుకింగ్ కౌంటర్లో రసీదులు, రికార్డులను పరిశీలించారు.
సిబ్బంది వారి ఆధార్ కార్డు వివరాలను తనిఖీ చేశారు. గోదాంలోనూ సరుకుల నిల్వలు, కొనుగోలు చేసిన స్టాక్ వివరాలను పరిశీలించారు. పరిపాలన విభాగంలోనూ రికార్డులను పరిశీలించి ఈఓ కృష్ణ ప్రసాద్తో మాట్లాడి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఎనిమిది గంటలపాటు సోదాలు చేసింది. ఒకో విభాగాన్ని దాదాపు రెండు సార్లు తనిఖీ చేసినట్లు తెలిసింది. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సిఐలు అనీల్ కుమార్, వరుణ్ ప్రసాద్, తాసిల్దార్ దినేష్ రెడ్డి, ఏఈ శశిధర్, ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్లు ఉన్నారు.