సిద్దిపేట టౌన్, నవంబర్ 24: సిద్దిపేట ఆర్టీవో కార్యాలయంలో గురువారం విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఖజానాలో రోజూ జమ చేయాల్సిన డబ్బులు జమ కాకపోవడం, ఆర్టీవో కార్యాలయ అధికారులపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. రవాణా శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉప రవాణా కమిషనర్ కే పాపారావు పర్యవేక్షణలో రవాణా శాఖ జాయింట్ కమిషనర్ సీ రమేశ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో డీటీవోను పిలిపించి తనిఖీలు జరిపారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. సిద్దిపేట కార్యాలయంలో ఏడాదిగా రాష్ట్ర ఖజానాకు జమ చేయని డీడీలను పెద్ద మొత్తంలో గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యలకు త్వరలో ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నారు.