భూదాన్ పోచంపల్లి, జనవరి 23 : భూదాన్ పోచంపల్లిలో ఇకత్ వస్త్ర దుకాణాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. 15 మంది బృందంతో ఏకకాలంలో 12 దుకాణాలపై దాడి చేశారు. ఇకత్ వస్త్రాలను పోలిన ప్రింటింగ్ చీరలు విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేసి సీజ్ చేశారు. 12 వస్త్ర దుకాణాల వారికి నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా స్టేట్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, రాష్ట్ర చేనేత జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ మునాసు వెంకటేశం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేనేత మగ్గాలపై తయారు చేయడానికి 11 రకాల చేనేత డిజైన్లను రిజర్వ్ చేసిందని, అందులో పోచంపల్లి ఇకత్ డిజైన్లు ఒకటి అని తెలిపారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చేనేతకు భౌగోళిక గుర్తింపు వచ్చిందని అన్నారు.
ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇకత్ వస్త్రాల ప్రొడక్షన్ను ప్రింటెడ్ రూపంలో మరమగ్గాలపై తయారు చేసి చేనేత వస్త్రాలని చెప్పి విక్రయిస్తున్నారని అన్నారు. ఇకత్ వస్త్రాలు పోలిన డూప్లికేట్ చీరలను గుర్తించి 12 షాపుల్లో సీజ్ చేసి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. పట్టుబడ్డ నకిలీ వస్త్రాలను చెన్నైలోని ల్యాబ్కు టెస్టింగ్ పంపిస్తామని, పవర్ లూమ్ ప్రింటింగ్ వస్త్రాలను తయారు చేస్తున్న కంపెనీలపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేనేత వస్త్రాలకు హ్యాండ్లూమ్ మార్, సిల్ మార్ ఉంటేనే ఒరిజినల్ అని, చేనేత వస్త్రాలు తయారుచేసే తయారీదారులు రిజిస్టర్ చేసుకుని లోగోలను వినియోగించు కోవాలని సూచించారు.