ఈటల బాధిత రైతుల ఆందోళన
ఎంపీ, ఎమ్మెల్యేకు వినతిపత్రాలు
వెల్దుర్తి, జూన్ 25: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. జమున హేచరీస్ పరిశ్రమ పేరుతో కబ్జా చేసిన తమ భూములను తిరిగి ఇప్పించాలని బాధిత రైతులు ఆందోళనకు దిగారు. శనివారం మెదక్ జిల్లా వెల్దుర్తిలో మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి హాజరయ్యారు. ఈటల భూకబ్జాతో భూములు కోల్పోయిన బాధిత రైతులు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి తమకు న్యాయం చేయాలని, తమ భూములు తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకొన్న ఎంపీ, ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. వారిచ్చిన వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి బాధితులతోపాటు మీడియాతో మాట్లాడారు.
జమున హేచరీస్ యాజమాన్యం మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట పరిధిలోని పలు సర్వే నంబర్లలో సుమారు 77.33 ఎకరాలతోపాటు హకీంపేట పరిధిలో ఎకరన్నర సీలింగ్, అసైన్డ్ భూముల్లో షెడ్ల నిర్మాణాలతోపాటు కబ్జాకు పాల్పడిందన్నారు. రైతులు సదరు భూముల్లోకి వెళ్లకుండా పరిశ్రమ యజమాన్యం అడ్డుకుంటున్నదని తెలిపారు. సదరు భూములు జమున, నితిన్రెడ్డి పేరుతో ఉన్నాయన్నారు. బాధిత రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలతో కలిసి బాధిత రైతుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.