హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): లాడ్జి వ్యవహారం అంటూ క్యూ న్యూస్లో తీన్మార్ మల్లన్న వాడిన భాషపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఓ వీడియోను విడుదల చేసిన యువతి తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్కుమార్పై విరుచుకుపడింది. లాడ్జి వ్యవహారం అని ఎట్లా అంటావని ప్రశ్నిస్తూ, చెప్పుతో కొడ్తానని తీవ్రంగా మండిపడింది. ‘న్యూస్లో నా ఫొటోలు ప్రసారం చేసేకంటే ఒక రోజు ముందు ఏదైనా ఉంటే మీరు మీరే చూసుకోండి అని మెస్సేజ్ పెట్టిన. అయినా మార్నింగ్ న్యూస్లో అమ్మాయిలను బద్నాం చేస్తూ ప్రసారం చేశాడు. క్యూ న్యూస్లో పనిచేస్తున్నపుడు మల్లన్న నాపై నిఘా పెట్టి వేరే వాళ్లతో ఫోన్ చేయించి తన గురించి తానే అడిగిపించాడు. ఎందుకురా భయ్ వాడితో తిరుగుతావ్ అని వాళ్లకు చెప్పిన. అలా అన్నందుకు నన్ను టార్గెట్ చేశాడు. ఆ రికార్డులు అతని వద్ద ఉన్నాయి. నేను అబ్బాయితో సెల్ఫీ దిగితే తప్పా?మనం ఏ జనరేషన్లో ఉంటున్నాం? మల్లన్నా.. నీతో కూడా నీ కొత్త ఒప్పో ఫోన్లో సెల్ఫీ దిగాను. దీనికి ఏమంటావ్? ప్రశ్నిస్తా అన్నావ్. ప్రశ్నించే వేదికను అమ్ముకున్నావ్. క్యూ న్యూస్ ఆఫీస్ను అక్రమాలకు అడ్డాగా మార్చి, ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నావ్’ అని తీన్మార్ మల్లన్నపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘బిడ్డా.. ఆడపిల్లల జోలికి వచ్చినవ్. నేను సిరిసిల్ల జర్నలిస్ట్ను. మొదటిసారి క్యూ న్యూస్లో స్ట్రింగ్ ఆపరేషన్ చేసినదాన్ని. నీవు ఇంత దిగజారినవ్. పెండ్లి అయినవాళ్లకు, పెండ్లి కానివాళ్లకు లింక్ పెట్టి విలువలను దిగజార్చుతున్నవ్. నీ వ్యక్తిగత జీవితం నాకు తెల్వదా? బిడ్డా.. నేనే కేసు పెట్టిన. దమ్ముంటే నిరూపించుకో’ అని సవాల్ విసిరింది. ‘లాడ్జి వ్యవహారం అని ఎలా అంటావ్ మల్లన్న. చెప్పుతో కొడ్తా. నీ తల్లి, చెల్లి, భార్య ఫోటోలు పెడితే ఊరుకుంటావా?’ అని బాధితురాలు ప్రశ్నించింది. మల్లన్న నిజస్వరూపాన్ని బయటపెట్టేవరకు ఎంతటి పోరాటమైనా చేస్తానని ఆమె వీడియోలో పేర్కొన్నది. కాగా, ఈ యువతి పెట్టిన కేసులోనే సైబర్క్రైమ్ పోలీసులు మంగళవారం రాత్రి క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డివైజ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇల్లు కొనేందుకు ఒప్పందం ప్రకారం రూ.10 లక్షలు చెల్లించిన ఒక మహిళ, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయంపై అవగాహన లేక ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. తర్వాత ఇల్లు అమ్మినవాళ్లు రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పెడితే న్యాయం చేయాలని ఆమె మల్లన్నను ఆశ్రయించినట్టు తెలిసింది. ఆమెకు న్యాయం చేయకుండా అవతలివారితో మల్లన్న చేయి కలిపినట్టు ఆరోపలున్నాయి. క్యూ కిచెన్ రూ. లక్షల విరాళాలను కూడా తన సోదరుడు వెంకటేశ్తో కలిసి బినామీ బ్యాంకు ఖాతాల ద్వారా పక్కదారి పట్టించారనే విమర్శలు ఉన్నాయి. ‘ఎవరితోనూ ఫోన్లో మాట్లాడడు, వాట్సాప్ కాల్లోనే మాట్లాడుతడు. అమ్మాయిలను ఒక రకంగా చూస్తూ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొడుతాడు’ అని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
‘నేను అడిగినట్టు రూ.30 లక్షలు ఇవ్వు. లేకపోతే నీ మీద ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తా’ అని ఓ జ్యోతిషుడిని తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ చేసినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించే చిలకలగూడ పోలీసులు మల్లన్నకు నోటీసులు జారీచేశారు. సన్నిదానం లక్ష్మీకాంత్ శర్మ అనే జ్యోతిషుడు ఈ ఏడాది ఏప్రిల్లో పోలీసులకు చేసిన ఫిర్యాదుతో మల్లన్నపై ఐపీసీ 387, 504 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది.