హైదరాబాద్: ఆచరణ సాధ్యం కాని విద్య వల్ల ప్రయోజనం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఉన్నతమైన కలలు, ఆచరణ, చేతల్లో చిత్తశుద్ధే విజయ రహస్యమని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం విజ్ఞులకు తగదన్నారు. మనవైన వేషభాషలు, ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని సూచించారు. హైదరాబాద్ ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్ట్లో జరిగిన ఉగాది వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలాన్ని గౌరవించి.. ప్రకృతిని రక్షించుకోవడమే ఉగాది సందేశమని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం చాటే సంస్కృతికి ఉగాది ప్రతీక అని చెప్పారు. ఉగాది పచ్చడి ఇచ్చే సందేశమే వ్యక్తిత్వ వికాసం పాఠమని తెలిపారు.
మన ఉనికిని కాపాడుకునేందుకు నిత్యం ప్రయత్నించాలని సూచించారు. ఇంట్లో, వీధిలో, బడిలో, గుడిలో తెలుగులోనే మాట్లాడాలని న్నారు. అమ్మభాష రాకుంటే అంతకు మించిన దరిద్రం మరొకటి లేదన్నారు. భాషను కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. సంప్రదాయ దుస్తులు, ఆహారం.. పెద్దలు మనకిచ్చిన ఆస్తి అని చెప్పారు. వాతావరణానికి అనుకూలమైన దుస్తులు వేసుకోవాలని, ఆహారం తీసుకోవాలని సూచించారు.
భారత్ ఎదుగుదల చూసి పాశ్చాత్య దేశాలకు అసూయ అని, మన ప్రగతిని అడ్డుకునేందుకు అనేక కుయుక్తులు పన్నుతున్నాయని చెప్పారు. దేశ ప్రతిష్ఠకు భంగకరమైన వార్తలపై అప్రమత్తత అవసరమని సూచించారు. సాంఘిక వివక్ష పాటించబోమని అందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. కులం కంటే గుణం మిన్న అనేదాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయం చాలా గొప్పవని చెప్పారు.