హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం నేడు జరుగనున్నది. ఆనవాయితీలో భాగంగా జలవిహార్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత 16 ఏండ్లుగా దసరా పండుగ తర్వాత దత్తాత్రేయ దీనిని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు తమిళిసై, బిశ్వభూషణ్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సీఎం కేసీఆర్ హాజరవుతారు. వీరితోపాటు పలువురు రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.