B Vinod Kumar | సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల విద్యాభివృద్ధి కృషి చేస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని పలువురు మైనారిటీలకు ఆర్థిక సహాయ పథకం కింద ఒక్కొక్కరికి రూ.లక్షల చొప్పున రూ.1.20కోట్ల విలువైన చెక్కుల అందజేశారు. అలాగే 425 మంది నిరుపేద మైనారిటీ మహిళలకు రూ.10వేల విలువైన మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత మైనారిటీ గురుకులాలను పెద్ద ఎత్తున స్థాపించారన్నారు. బాలబాలికలకు ఐదు నుంచి డిగ్రీ వరకు గురుకులాల ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్యనందిస్తున్నారని చెప్పారు.
ఏటా ఒక్కో విద్యార్థిపై రూ.1.20లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. గురుకులాల్లో చదివే బాలబాలికలకు మెరుగైన విద్యా బోధన అందుతుందన్నారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలో సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండగా మైనార్టీ గురుకులాలకు తమ పిల్లలను పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. ఫలితంగా కొన్ని మైనారిటీ గురుకులాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. మైనార్టీలు చదువు ప్రాధాన్యతను గుర్తించి తమ పిల్లలను ముఖ్యంగా బాలికలను గురుకులాల్లో చేర్పించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని సీట్లు భర్తీ అయ్యేలా చూడాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం సబ్బండ వర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.