హనుమకొండ చౌరస్తా, జూన్ 26: కాకతీయ యూనివర్సిటీ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో యునైటెడ్ కింగ్డం వేల్స్ గ్రూప్ అబెరిస్ట్విత్ యూనివర్సిటీ సహకారంతో ‘ప్లాంట్ బయోటెక్నాలజీ అండ్ జినోమ్ ఎడిటింగ్’ అంశంపై ఈ నెల 27 నుంచి 29 వరకు వర్సిటీ సెనెట్ హాల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ తెలిపారు. సోమవారం విశ్వవిద్యాలయ సెనెట్ హాల్లో వీసీ మీడియాతో మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో 8 దేశాల నుంచి శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు. 27న ప్రారంభ సదస్సులో ముఖ్యఅతిథిగా వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రమేశ్, విశిష్ట అతిథులుగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీయేట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్మిట్టల్ పాల్గొంటారని చెప్పారు.
ఈ సదస్సుకు జాతీయ స్థాయి సంస్థలైన ఇక్రిశాట్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్, సీసీఎంబీ, నాబితోపాటు హైదరాబాద్ యూనివర్సిటీ, సావిత్రీబాయి ఫూలే, పంజాబ్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, యూనివర్సిటీ అఫ్ మద్రాస్, ఇతర యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు హాజరవుతారని వివరించారు. బయోటెక్నాలజీ, జినోమ్ ఎడిటింగ్, ఇతర సంబంధిత సబ్జెక్టులు బోటనీ, జంతుశాస్త్రం, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, మైక్రోబయాలజీ, ఫార్మసీల నుంచి 120 పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. బెస్ట్ పోస్టర్, బెస్ట్ ఓరల్ ప్రజంటేషన్లకు బహుమతి, అవార్డు ప్రదానం ఉంటుందని, ఆచార్య ఎంజీకే జోన్స్తో ప్రత్యేక ముఖాముఖి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు, బయోటెక్నాలజీ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.