న్యూఢిల్లీ, మార్చి 20: దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల్లోనే 40,953 కేసులు నమోదయ్యాయి. గత 111 రోజుల్లో ఇదే అత్యధికం. ఒక్క మహారాష్ట్రలోనే ఒక్కరోజులో ఏకంగా 27,126 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత మూడు రోజుల్లోనే దేశంలో సుమారు లక్ష కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రతో పాటు పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానాలలో కరోనా విజృంభిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.
ఆదిత్య ఠాక్రేకు పాజిటివ్
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే కొడుకు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే శనివారం కరోనా బారినపడ్డారు. వైరస్ విజృంభణ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో రోజూ కనీసం 47వేల యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాలని బృహణ్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. కాగా, వచ్చే నెలలో జరుగనున్న 10,12వ తరగతుల బోర్డు పరీక్షలను ప్రత్యక్షంగానే నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. గుజరాత్లో ఆటోరిక్షా డ్రైవర్లు, దుకాణాదారులు, సెలూన్ యజమానులకు యాంటిజెన్ పరీక్షలు నిర్వహించి కరోనా నెగెటివ్ ఐడెంటిటీ కార్డులు జారీచేయనున్నారు. తమిళనాడులో సోమవారం నుంచి 9,10,11వ తరగతులకు బడులను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
టీకాతో 8-10 నెలల వరకు రక్షణ
కరోనా టీకాలు 8-10 నెలల వరకు వైరస్ నుంచి రక్షణ ఇవ్వగలవని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. శనివారం ఐపీఎస్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లే వైరస్ మళ్లీ విజృంభిస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా పోలీసులు కరోనాకు బలయ్యారని ఐపీఎస్ అసోసియేషన్ వెల్లడించింది.
టీకా తీసుకున్నా..ఇమ్రాన్ఖాన్కు కరోనా
పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు కరోనా సోకింది. గురువారం ఆయన కరోనా టీకా తొలి డోసును తీసుకున్నప్పటికీ వైరస్ బారిన పడ్డారు. ఇమ్రాన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు..