Verity Wedding | మంచిర్యాల : పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో కీలకమైన మధుర క్షణాలను బంధువులందరి సమక్షంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై జరుపుకుంటారు. కానీ, ఓ జంట మాత్రం యువతీ యువకుడి పెళ్లి మాత్రం పెంట కుప్ప వద్ద జరిగింది. ఈ వివాహం మంచిర్యాల జిల్లా నాగారం గ్రామంలో సోమవారం జరిగింది. పంట పొలాలకు ఎరువుగా వాడే పెంట కుప్పను ఇక్కడి ఆదివాసులు దేవతగా భావిస్తారు. పంచ భూతాలు అక్కడే ఉంటాయని, వివాహ సమయంలో అక్కడ కుల దేవతలకు పూజలు చేసి వధూవరులతో ప్రమాణం చేయిస్తే కొత్త జంట కలకాలం కలిసుంటారనేది వారి నమ్మకం.
పెండ్లికి ముందు ఇలా పూజలు చేస్తే కీడు, శని తొలగిపోతాయని విశ్వసిస్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగారం, గఢ్పూర్, ర్యాలీ, చిన్నగోపాల్పూర్, కొలాంగూడ గ్రామాల్లో గోండు, పర్దాన్లు, తోటి, కొలాం ఇలా దాదాపు 9 నుంచి 12 తెగల గిరిజనులు ఇప్పటికీ ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే పాత సాంప్రదాయాన్ని అనుసరించి వరుడి తరఫు వారు వధువుకు కట్నం ఇస్తారు. పెండ్లి తంతు అంతా వరుడి తరఫు వారిదే. ఖర్చు, భోజనాలతో పాటు పెండ్లికి రెండు రోజుల ముందు నుంచే వధువు తరఫున వారికి విడిది ఏర్పాటు చేసి, సకల మర్యాదాలు చేస్తామని అక్కడి కుల పెద్దలు చెప్తున్నారు.