షాబాద్, జూలై 11: ఆరుగురు హత్యకు గురికావడంతో ఆగ్రహించిన వారి కుటుంబీకులు, బంధువులు శనివారం షాబాద్ ఠాణా ఎదుట ఉన్న ముంబై-బెంగళూరు లింకు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఉదయం 7 గంటలకు ధర్నా ప్రారంభం కాగా అప్పటినుంచి ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. మధ్యలో కొందరు నాయకులొచ్చి వారికి మద్దతుగా నిలిచారు.
మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యే కాలె యాదయ్య ధర్నా స్థలానికి రావడంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అక్కడున్న పోలీసులు అప్రమత్తమై ఎమ్మెల్యేను అక్కడి నుంచి తీసుకెళ్లారు. రాత్రి నుంచి తాము బాధలో ఉండి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్యే రావడం ఏమిటని బాధితులు మండిపడ్డారు.