ఎనుమాముల మార్కెట్లో అడ్తి వ్యాపారుల ఆందోళన
కాశీబుగ్గ, అక్టోబర్ 12: మిర్చి వ్యాపారులు దాదాపు రూ.10 కోట్లతో ఉడాయించడంతో అడ్తి వ్యాపారులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఎనుమాముల మార్కెట్లో బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు ఇలా.. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన బిల్లా నాగేందర్, యుగేంధర్ అనే మిర్చి వ్యాపారులు పదేండ్లుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అడ్తిదారుల నుంచి కొనుగోలు చేసిన మిర్చికి సంబంధించిన సుమారు రూ.10 కోట్లను 15 రోజుల నుంచి నెలలోపు చెల్లించాలి. కానీ, 6 నెలలుగా జాప్యం చేస్త్తున్నారు. ఈ నెల 7న అడ్తిదారులందరికీ డబ్బులు చెల్లిస్తామని ఫోన్ ద్వారా తెలిపి స్విచ్ఛాఫ్ చేశారు. ఐదు రోజులుగా ఇండ్లకు తాళాలు వేసి పరారీలో ఉన్నారు. దీంతో మార్కెట్ పరిధిలోని సుమారు 50 మంది అడ్తి వ్యాపారులు మంగళవారం మార్కెట్లో ఆందోళనకు దిగారు. రెండు గంటలపాటు కాంటాలు నిలిచిపోయాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీపీ, కలెక్టర్ హామీ ఇవ్వడంతో అడ్తివ్యాపారులు ఆందోళన విరమించి.. యథావిధిగా కాంటాలు నిర్వహించారు.