Vemualawada | వేములవాడ టౌన్ : అలవైకుంఠం ఇలకు దిగివచ్చినట్లుగా.. పెద్దసంఖ్యలో తరలివచ్చిన అశేష భక్తజనం.. శివ పార్వతుల( Shiva Parvathi ) శివనామస్మరణ, వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శుక్రవారం ఆది దంపతుల కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. రాజన్న ఆలయ అద్దాల మండపంలో అలంకరించిన పెళ్లి వేదికపై శివపార్వతులు పట్టువస్ర్తాలు, బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చారు. తీర్థరాజ పూజతో ఈ కల్యాణ తంతు ప్రారంభమైంది.
ఆలయ అర్చకులు ధ్వజారోహణం, వృషభేశ్వరుడికి కల్యాణం జరిపించిన అనంతరం శూలానికి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం ఉదయం 11:40 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తాన ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు నమిలకొండ ఉమేశ్శర్మ ,ఈశ్వరగారి సురేశ్, ఉపప్రధానాచార్యులు చంద్రగరి శరత్, నమిలకొండ రాజేశ్వరశర్మ, గోపన్నగారి గణేశ్, ఒజ్జల ఆదిత్య, ఆస్థాన వేదపండితులు, అర్చకబృందం వివాహ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆలయం తరఫున ఈవో కృష్ణప్రసాద్ దంపతులు, వేములవాడ మున్సిపల్ తరఫున చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు ఆదిదంపతులకు పట్టువస్ర్తాలు సమర్పించారు. గోపన్నగారి వసంత్-సరిత దంపతులు కన్యాదాతగా వ్యవహరించారు. సుమారు 50 వేల మందికిపైగా భక్తులు శివపార్వతులు తరలివచ్చి ఆదిదంపతుల కల్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు. కల్యాణం జరుగుతున్నంతసేపు శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ వారి భక్తిని చాటుకున్నారు. పరస్పరం జిలుకర బెల్లాన్ని ఉంచుకుని దేవుడికి సమర్పితులయ్యారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా అష్టావధాని తిగుళ్ళ శ్రీహరిశర్మ వ్యవహరించారు.