వేములవాడ, నవంబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ దక్షిణ ప్రాకారం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో భాగంగా పాత నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే కళాభవన్, కల్యాణకట్ట, ఆలయ ఈవో కార్యాలయం, ఎన్టీఆర్ అతిథి గృహం, నైవేద్యశాల, లైన్లు తొలగించగా, శనివారం నుంచి దక్షిణం వైపు ప్రాకారాన్ని తొలగిస్తున్నారు. దక్షిణ ప్రాకారం ఆనుకొని ఉన్న కోటి లింగాలను అక్కడి నుంచి తరలించారు.
శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతిస్వామి అనుమతితో కోటిలింగాలను తరలించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. పాత ఆంధ్రాబ్యాంకు వైపు 20 అడుగులకు పైగా రాజన్న ఆలయాన్ని విస్తరించే అవకాశం ఉండగా ఇందులో భాగంగానే తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు.