హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్బాబును రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు (వ్యవసాయరంగ వ్యవహారాలు)గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ హోదాలో ఆయన ఈ పదవిలో ఐదేండ్లపాటు కొనసాగుతారని సీఎస్ శాంతికుమారి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా తనను నియమించినందుకు రమేశ్బాబు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఆయనకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. ఈ సందర్భంగా రమేశ్బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఆరు దశాబ్దాలుగా నెలకొన్న సంక్షోభాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దశాబ్ది కాలంలోపే అధిగమించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.