చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 27 : దేశం సిగ్గుపడేలా నీచ రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రలు తెలంగాణలో సాగవని పేర్కొన్నారు. గురువారం చౌటుప్పల్ మండలంలోని డీ నాగారంలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసేందుకు బీజేపీ ప్రయత్నించడాన్ని నిరసిస్తూ కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్షా కూలదోసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.100 కోట్లు పెట్టి కొనాలనే ప్రయత్నాన్ని నిఖార్సైన తెలంగాణ బిడ్డలు తిప్పికొట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. అమ్ముడుపోయి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్రెడ్డి మాదిరిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని ఆయన స్పష్టం చేశారు.