కమ్మర్పల్లి/ వేల్పూర్/ ధర్మారం/ నిర్మల్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మోదీ చెప్పినట్టు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై గవర్నర్ నేరుగా ఎలా విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్నాననే విషయాన్ని తమిళిసై మరిచిపోతున్నారని విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, వేల్పూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గాల ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి హాజరై, మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు బీజేపీయేతర రాష్ర్టాల్లో ప్రభుత్వాలపై ఘజినీ మహ్మద్ కన్నా దుర్మార్గంగా దాడులు చేస్తున్నదని దుయ్యబట్టారు. పార్టీలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్ రాజ్ భవన్లో బీజేపీ నేతలతో సమావేశాలు ఎలా పెడతారని, గవర్నర్ అధికారిక పర్యటనలు ప్రభుత్వం, అధికారుల కన్నా ముందుగా బీజేపీ వాళ్లకు ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. 2007లో జరిగిన 2జీ స్పెక్ట్రం వేలంలో లక్షా 70 వేల కోట్లకు అమ్ముడుపోతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినా 5జీ స్పెక్ట్రం లక్షా 50 వేల కోట్లకు విక్రయించడం అనుమానస్పదంగా ఉన్నదన్నారు. అదానికి దోచిపెడుతున్న దాంట్లో మోదీ, అమిత్షా వాటా ఎంత అని ప్రశ్నించారు.
రాంలాల్కు పట్టిన గతే: మంత్రి అల్లోల
గవర్నర్ తమిళిసై రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజ్భవన్ను ఆమె రాజకీయ భవన్లా మార్చారని నిర్మల్లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లో విమర్శించారు. గవర్నర్ పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే గతంలో గవర్నర్ రాంలాల్కు పట్టిన గతే పడుతుందని హితవు పలికారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లో ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై రాజకీయాలు మాట్లాడటం బాధాకరమన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.