హైదరాబాద్, ఏప్రిల్ 16( నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం పబ్లిక్ సెక్టార్లను ధ్వంసం చేస్తున్నదని, వాటి మూసివేతే బీజేపీ ప్రభుత్వ ప్రధాన ముసాయిదా అని కవి, రచయిత, వీక్షణం మాసపత్రిక సంపాదకుడు ఎన్ వేణుగోపాల్ ఆరోపించారు. పబ్లిక్ సెక్టార్ల మూసివేతకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ‘పబ్లిక్ సెక్టార్ల మూసివేత- సమాజంపై ప్రభావం’పై నిర్వహించిన సదస్సులో వేణుగోపాల్ మాట్లాడుతూ.. దేశంలో ఐదు వేలకు పైగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2,900 పరిశ్రమలే ఉన్నాయని తెలిపారు.
చిన్నతరహా పరిశ్రమల మూసివేతకు ప్రధాని మోదీ కారణమని మండిపడ్డారు. నిజాం చకెర ఫ్యాక్టరీకి చెందిన ఏడు వేల ఎకరాలభూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. సదస్సులో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధర్మేంద్ర, రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.