హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీసీతారామ సేవా సదన్, జనార్దనానంద స్వామి సేవా ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో 23వ తెలంగాణ వేద విద్వన్మహాసభలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 5 వరకు 23వ వార్షిక విద్వత్సమావేశాలు, వేద పరీక్షలు నిర్వహించనున్నారు. సుమారు 500 మంది వేద విద్యార్థులకు నాలుగు వేదాల్లో పరీక్షలుంటాయి. సభల్లో భాగంగా వేదమాత అనుగ్రహప్రాప్తి కోసం శుక్ల యజుర్వేదం హవనము నిర్వహిస్తున్నామని, ఇందులో 1,000 మంది వివిధ ప్రాంతాలవారు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వేదవిద్యను జనాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.