హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కొత్త పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ పేరుపై ఇంకా సస్పెన్స్ ఉన్నా.. ఆ కొత్త పార్టీకి దాదాపు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అన్న పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే దేశ రాజకీయాల్లో మార్పు కోరుతూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను కొన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన విదుతాలై చిరుతైగల్ కచ్చె(వీసీకే) పార్టీని .. కేసీఆర్ కొత్త పార్టీలో విలీనం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు నుంచి VCK వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్ కూడా హైదరాబాద్కు వచ్చారు. తమిళనాడు తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావును కూడా ఆహ్వానించారు. మరో వైపు తమ పార్టీలను కొత్త పార్టీలో విలీనం చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. తమిళనాడుకు చెందిన VCK తెలంగాణ భవన్ వేదికగా విలీనకం కానున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా కేసీఆర్ కొత్త పార్టీలో విలీనమయ్యేందుకు రంగం సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
బీఆర్ఎస్ ఏర్పాటు కార్యక్రమానికి రావాల్సిందిగా పలు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నేతలకు కేసీఆర్ ఆహ్వానాలు పంపించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు పలు రాష్ట్రాల నుంచి 40 మంది ప్రముఖ నేతలు హైదరాబాద్కి చేరుకున్నారు. కర్ణాటక నుంచి జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్ణతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఆ నేతలకు సీఎం కేసీఆర్ ఆల్పాహార విందు ఇచ్చారు.