Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 30: ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు జారీ చేసిన మరో సర్క్యులర్పై వివాదం రాజుకుంటున్నది. ఓయూలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ 15 రోజుల క్రితం జారీ చేసిన సర్క్యులర్పై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. అంతలోనే మరో సర్క్యులర్ రగడకు దారితీసింది. విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలలు, విభాగాల్లో సదస్సులు, వర్క్షాప్లు, అతిథి ఉపన్యాసాలు నిర్వహిస్తుంటారు. ఆయా సదస్సుల ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలకు వర్సిటీ అధికారులను అతిథులుగా ఆహ్వానించడం ఆనవాయితీ. అయితే, ఆయా కార్యక్రమాల పోస్టర్లపై అనుమతి లేకుండానే పేర్లు ముద్రించవద్దని, ముందుగా తమ అనుమతి తీసుకోవాలని తాజా సర్క్యులర్లో ఆదేశించారు.
సదస్సు ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలు గరిష్ఠంగా 45 నిమిషాలు మాత్రమే ఉండాలని నిర్దేశించారు. వేదికపైకి ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించడం సరికాదని పేర్కొన్నారు. సదస్సుకు సంబంధించిన ప్రెస్నోట్ను కేవలం పీఆర్వో ద్వారా మాత్రమే విడుదల చేయాలని, ఒక కాపీని ఐక్యూ ఏసీ విభాగానికి పంపించాలని సూచించారు. ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఒక పేజీ వివరణ, జియోట్యాగ్తో కూడిన ఫొటోలు తప్పనిసరి అని పేర్కొన్నారు. అతిథులు, ఆహ్వానితుల వివరాలు, సమయం, వేదిక ముందుగానే తమకు తెలియజేయాలని ఆదేశించారు.
ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అభ్యంతరం వ్యక్తంచేసింది. వీసీ నిర్ణయాలతో యూనివర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ బీ మనోహర్ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. వర్సిటీ అధ్యాపకులను వీసీ తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. వర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై చాన్స్లర్గా జోక్యం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే గవర్నర్కు లేఖ రాసిన ఔటా ప్రతినిధులు రెండు మూడు రోజుల్లో ఆయనను నేరుగా కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.