నాగర్కర్నూల్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంప్హౌస్లు నీటమునుగుతున్నాయి. గత నెల నల్లగొండ జిల్లాలోని సుంకిశాల పంప్హౌస్ నీటమునిగిన విషయం మరువకముందే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో (PRLI) మరో ఘటన చోటుచేసుకున్నది. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన పీఆర్ఎల్ఐ పథకంలో భాగంగా నాగర్కర్నూలు జిల్లాలోని కుమ్మెర వద్ద నిర్మించిన వట్టెం పంప్హౌస్ (Vattem Pump House) నీటమునిగింది. ప్యాకేజీ-7లోని ఆడిట్ నుంచి పంప్హౌస్ సొరంగమార్గంలోకి నాగనూలు, నాగర్కర్నూలు చెరువల నుంచి భారీగా వరద వచ్చిచేరింది.
వట్టెం పంపింగ్ స్టేషన్లో మొత్తం 10 మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు నాలుగు బిగించారు. మరో మోటారు నిర్మాణ దశలో ఉన్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాగర్కర్నూల్ జిల్లాలోని గొలుసుకట్టు చెరువులు భారీ వరదతో పొంగిపొర్లాయి. తూడికుర్తి, శ్రీపురం, నాగనూలు చెరువులు నిండి అలుగు పారాయి. ఈ చెరువుల సమీపంలో పీఆర్ఎల్ఐ పథకం టన్నెల్ ఉన్నది. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన మార్గం మీదుగా ఈ చెరువుల వరద నీరు సర్జిపూల్లోకి వచ్చి గేట్ల ద్వారా పంపుహౌస్లోకి వెళ్లింది. దీంతో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది. ఈ విషయాలు బయటకు రాకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం డీ వాటరింగ్ చేస్తున్నారు. ఈ నీళ్లన్నీ బయటకు వెళ్లిపోతే ఎంత మేర నష్టం వాటిల్లిందో స్పష్టత రానుంది.