యాదాద్రి భువనగిరి : ఇవాళ్టి నుంచి వాసాలమర్రి మొత్తం తన కుటుంబమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వాసాలమర్రి గ్రామ సందర్శనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.
కులమతాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వాసాలమర్రి అభివృద్ధికి గ్రామస్తులంతా ప్రతిజ్ఞ చేయాలి. సమస్య ఉంటే అందరం కలిసి సమిష్టిగా పోరాడితే సమస్యలు తొలగిపోతాయి. గ్రామంలో రెక్కల కష్టంపై బతికేవాళ్లకు అండగా నిలవాలన్నారు. గ్రామ అవసరాలు ఇక్కడ లభించే వనరుల ద్వారా తీర్చుకోవాలి. గ్రామస్తులంతా 2 గంటలు పని చేస్తే అభివృద్ధి తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. వాసాలమర్రికి బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ నిర్మిద్దాం. రోడ్లను బాగు చేసుకుందాం. ఎవరికి ఏం అవసరమున్నా మంజూరు చేసే బాధ్యత తనది. అందరూ ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ఊర్లోని మూడు దళితవాడలకు వెళ్లి వాళ్లతో మాట్లాడి పరిష్కరిస్తాను అని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు పథకాల గురించి వివరించే వాళ్లు ముందుకు రావాలి. రాబోయే రోజుల్లో గ్రామ నిధి ఏర్పాటు చేసుకుని, కష్టమొచ్చిన వారికి అండగా నిలిచే అవకాశం ఉంటుంది. తొలుత గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ శ్రమదాన కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. పరిశుభ్రత, తాగునీరు కమిటీ, హరితహారం కమిటీ, వ్యవసాయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి అని సీఎం కేసీఆర్ సూచించారు.