నయీంనగర్, జూలై 30 : మాదిగలను వంచించిన బీజేపీకి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం ఆయన హనుమకొండలోని వడ్డేపల్లిలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని ప్రగల్భాలు పలికి మాట మార్చిందని మండిపడ్డారు. వర్గీకరణపై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత ప్రాంతమైన మణిపూర్లో జరుగుతున్న దాడుల్లో క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.