ముషీరాబాద్, ఏప్రిల్ 9 : కార్పొరేట్ విద్యావ్యవస్థతో సీఎం రేవంత్రెడ్డి కుమ్మక్కవడంతో రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా విద్యావ్యవస్థ నడుస్తున్నదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. ప్రభుత్వమే ముందుండి కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నదని, విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. గురువారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం వద్దనే ఉన్న విద్యాశాఖను ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఇంటర్ బోర్డులో నిబంధనలకు విరుద్ధంగా వేసవి తరగతులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని, నారాయణ, చైతన్య, రిజన్స్, ఏఆర్, వాల్ అలేన్ వంటి కార్పొరేట్ శక్తులు నిబంధనలు అతిక్రమించి తరగతులు చేపడుతున్నా అధికారులకు చర్యలు తీసుకొనే ధైర్యం లేదని విమర్శించారు.
బడ్జెట్లో విద్యకు 9.8% నిధులు కేటాయించడం అంటే.. విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసే లక్ష్యంతో పని చేస్తున్నట్టు ఉన్నదని ఆరోపించారు. మిగతా రాష్ర్టాలు సగటున 14.5% నిధులు విద్యకు కేటాయిస్తుంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం అతితక్కువ కేటాయించి తన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని, జాతీయ విద్యా విధానం ప్రకారం జీడీపీలో 6% కేటాయించాలని సూచించినా అది 2 శాతానికి మించడం లేదని వాపోయారు. సాక్షాత్తు సీఎం ప్రైవేట్ కాలేజీని ప్రారంభించడం అంటే కార్పొరేట్ విద్యను ప్రోత్సహించడమేనని, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమేనని మండిపడ్డారు. ఈ నెల 15 లోగా కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోతే సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సభ్యులు సంజీవ, కొల్లూరు వెంకట్, వరిగడ్డి చందు, సురేశ్, శ్యామ్రావు, అంజయ్య, కానుగంటి సురేశ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.