దుండిగల్, డిసెంబర్ 29: హైదరాబాద్ శివారు సూరారంలోని నారాయణ మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ దవాఖానలో వైద్యులు ఓ వృద్ధురాలికి అరుదైన గుండె ఆపరేషన్ చేశారు. కత్తిగాటు లేకుండా ఒక గంటలోనే మూసుకుపోయిన వాల్వ్ను తొలగించి దాని స్థానంలో మరొకటి అమర్చారు. ఈ వివరాలను బుధవారం దవాఖానలో మీడియాకు వెల్లడించారు. మేడ్చల్ మండలం డబీల్పూర్ గ్రామానికి చెందిన కౌసల్య(78)కు పదిరోజుల క్రితం శ్వాస ఆడకపోవడంతో కుటుంబసభ్యులు నారాయణ మల్లారెడ్డి మల్టీస్పెషాలిటీ దవాఖానలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు కవాటం (వాల్వ్) మార్పిడి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గతంలోనైతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ‘ట్రాన్స్కాథెటర్ అయోరిక్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్’ (టావేర్) అనే నూతన పద్ధతిలో కత్తిగాటు లేకుండా గంటన్నరలోనే కవాటం మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు కార్డియాలజీ విభాగం వైద్యుడు డాక్టర్ కమల్కుమార్చావ్లా, డాక్టర్ ప్రకాశ్అజ్మీరా వివరించారు. కౌసల్య ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.