మహబూబ్ నగర్ ఆగస్టు 13 : దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం అయన జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానం నుంచి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గాంధీజీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వంటి ఎంతో మంది దేశభక్తులు, స్వాతంత్య్ర సమరయోధులు వారి ప్రాణాలను అర్పించి బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమికొట్టి స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చారని అన్నారు.
సమాజంలో ఉన్న అసమానతలు పోవాలని, మానవత్వంతో ప్రతి ఒక్కరు ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలని, అభివృద్ధిలో యువత ముఖ్యపాత్ర పోషించాలని ఆయన సూచించారు.
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం అందిన నాడే మనం నిజమైన అభివృద్ధిని సాధించిన వారమవుతామని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు గోపాల్ యాదవ్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ ఉన్నారు.