Vaikunta Ekadashi | యాదగిరిగుట్టలో శనివారం వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలను వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 6:48 గంటలకు ప్రధానాలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. పాతగుట్ట లక్ష్మీనారసింహుడు ఉత్తర రాజగోపురం గుండా 6:42 గంటలకు వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చారు. ఆలయ చరిత్రలో యాదగిరీశుడు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమివ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనమిస్తుండటంతో భక్తుల నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మార్మోగుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు ఉత్తర ద్వారం గుండా దర్శనం అనంతరం.. స్వామివారిని ఆలయ ముఖ మండపంలో వేంచేపు చేసి సాయంత్రం వరకు ఉత్తర ద్వారం గుండా భక్తులకు అనుమతినిచ్చి దర్శన భాగ్యం కల్పించనున్నారు.
కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ వేళల్లో మార్పులు చేసినట్టు ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు చెప్పారు. స్వామివారి బ్రేక్ దర్శనం ఉదయం 9 గంటలకు ఉండగా.. ఆ సమయాన్ని 11 గంటలకు మా ర్చినట్టు వెల్లడించారు. భక్తులతో నిర్వహించే పలు కార్యక్రమాలను రద్దుచేశారు.