హనుమకొండ రస్తా, డిసెంబర్ 8: బీసీలను మోసం చేసిన రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ప్రస్తుతం జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించి బీసీల రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలని బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ పిలుపునిచ్చారు. హనుమకొండ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 15,16 వ తేదీలలో చేపట్టబోయే ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి పోస్టర్లను బీసీ జేఏసీ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ మాట్లాడుతూ చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేమని, పార్టీపరంగా 60 శాతం ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ మొన్న గాంధీభవంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలోగానీ, మక్తల్, కొత్తగూడెం, హుస్నాబాద్లలో జరిగిన బహిరంగ సభలోగానీ సీఎం రేవంత్రెడ్డిగానీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ ఆ మాటే మాట్లాడడం లేదన్నారు. బీసీలను మోసగించడానికి 60 శాతం అంటూ డ్రామాలాడారని ఆయన మండిపడ్డారు. ఇక సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీని కలిసిన సందర్భంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల గురించి ప్రధానితో చర్చించకపోవడం బీసీలను నయవంచనకు గురిచేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు.
బిజెపి, కాంగ్రెస్ దొందు దొందే..
అడగాల్సిన కాంగ్రెస్ అడగడం లేదని, చేయాల్సిన బిజెపి బీసీ రిజర్వేషన్ల బిల్లును తొక్కిపెడుతుందని, బీసీలను నమ్మించి మోసం చేయడంలో బిజెపి, కాంగ్రెస్ దొందు దొందేనని, వారి అబద్ధాలకు ఎన్ని అవార్డులు ఇచ్చిన సరిపోవని ఆయన ఎద్దేవా చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే రాష్ర్టవ్యాప్తంగా బీసీలకు 5380 సర్పంచ్ స్థానాలు దక్కేవని, బీసీ రిజర్వేషన్లను 17 శాతంకు తగ్గించడం వలన కేవలం 2300 సర్పంచ్ సీట్లు బీసీలకు వచ్చినవి.. ఇలా బీసీలను మోసం చేశారన్నారు. రాజకీయ పార్టీలు బీసీలకు చేసిన మోసానికి బుద్ధి చెప్పాలంటే రాష్ర్టంలోని జనరల్ స్థానాలలో నిలబడిన బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించి సర్పంచ్ ఎన్నికల్లో బీసీల సత్తాను చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని ఈనెల 15వ తేదీన ఢిల్లీలో పార్లమెంటును ముట్టడించడానికి జిల్లా నుండి పార్టీలకతీతంగా వేలాదిమంది ఢిల్లీకి తరలిరావాలని, 16వ తేదీన ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు దొడ్డపల్లి రఘుపతి, చిర్ర రాజు, బోనగాని యాదగరిగౌడ్, తమ్మేల శోభారాణి, తెల్ల సుగుణ, కిశోర్ భీమగాని యాదగిరి, బక్కి అవినాష్ పాల్గొన్నారు.