హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): అనేక అనర్థాలు, ఎంతోమంది ఆత్మహత్యలకు కారణంగా మారిన ‘పారాక్వాట్ డైక్లోరైడ్’ అనే గడ్డి మందును నిషేధించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర మంత్రి శివరాజుసింగ్ చౌహాన్ను కోరారు.
కేంద్ర మంత్రిని గురువారం కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేశారు. గడ్డి మందు వల్ల జరుగుతున్న అనర్థాల గురించి మంత్రికి వివరించారు. విషపూరితమైన ఈ గడ్డి మందును నిషేధించి, ఆత్మహత్యలు జరుగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బొగ్గు గనుల శాఖ సంప్రదింపుల కమిటీ చైర్మన్, ఆ శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం పార్లమెంట్ అనెక్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.
ప్రమాదకరమైన గడ్డిమందు, కలుపు మందుల నిషేధంపై అసెంబ్లీలో చర్చించేందుకు కృషి చేస్తామని రైతు కమిషన్ చైర్మన్ ఏ కోదండరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం, స్పీకర్, శాసనసభ వ్యవహారాల మంత్రికి నివేదిక ఇవ్వనున్నట్టు వెల్లడించారు.