హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సింగరేణి వ్యాప్తంగా అందరికీ ఆగస్టు నెలాఖరులోగా కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని జీఎం (కో-ఆర్డినేషన్, మార్కెటింగ్) కే సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి పరిధిలో ఇప్పటికే 32,417 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యిందన్నారు. వీరిలో 12,113 మంది సింగరేణి ఉద్యోగులు, 14,122 మంది కార్మికుల కుటుంబీకులు, 6,182 మంది ఇతరులు ఉన్నారని వివరించారు. సింగరేణి కార్మికులను కూడా ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి, వ్యాక్సినేషన్లో ప్రాధాన్యమివ్వాలన్న సీఎండీ ఎన్ శ్రీధర్ విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, వైద్యారోగ్య శాఖ సహకారంతో విస్తృతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవిడ్ వైద్యసేవల అనుసంధానాధికారి డాక్టర్ బాలకోటయ్య, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్, పీఆర్వో మహేశ్, డాక్టర్ పూర్ణచందర్రావు తదితరులు పాల్గొన్నారు.