హనుమకొండ : రేపటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులకు సూచించారు. వ్యాక్సిన్ వేసేందుకు తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై బుధవారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్, రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, జడ్పీ చైర్మన్లు, డీపీవోలు, సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రతి రోజూ 3 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని అన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాల పైబడిన వారు 2 కోట్ల 80 లక్షల మంది ఉన్నారని తెలిపారు.
కాగా ఇప్పటి వరకు కోటీ 45 లక్షల మంది మొదటి డోస్, సెకండ్ డోసు వ్యాక్సినేషన్ 55 లక్షల మందికి పూర్తయిందని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్ఫూర్తితో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలని మంత్రి పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డుమెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.
జిల్లా స్థాయిలో డీఆర్డీవోలు మహిళా గ్రూపు సంఘాలతో సమన్వయం చేసి వ్యాక్సినేషన్ అందరూ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభమైనందున విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఉపాధ్యాయులు, సూల్లో పనిచేసే ఇతర సిబ్బంది అందరికీ 100% శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు.
సర్పంచ్లు ఎప్పటికప్పుడు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, పంచాయతీ సెక్రటరీలు, వార్డుసభ్యులతో సమన్వయం చేసుకొని వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. మొదటి డోసు వ్యాక్సినేషన్ వేసుకోని వాళ్లకు వెంటనే వేయాలని, అలాగే రెండవ డోసు తీసుకోనివారిని వెంటనే తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు.
కరోనా పేషెంట్లు ఉంటే బాగోగులు సంబంధిత డాక్టర్లు, డీఎంహెచ్ఓలు, డీఎల్పీవోలు , డీపీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో రెండ్లు కోట్ల డోసుల వాక్సినేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు.
సమావేశంలో డీఎంఈ రమేశ్రెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్వో డాక్టర్ కే లలితాదేవి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చైత్రను హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
కొవిడ్-19 : భారత్లో ఆ వేరియంట్లను గుర్తించలేదు
Priyanka Vadra : అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!