వనపర్తి, జనవరి 23 (నమస్తే తెలంగాణ): సముద్రపు నాచుతో సంపద సృష్టించవచ్చని నిరూపించారు వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలం తూంకుంటకు చెందిన వీ మదన్మోహన్రావు. సముద్రం నీటితో స్పైరునిలా పౌడర్ను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఈ పౌడర్కు మంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ వరకు చదువున్న మదన్మోహన్ కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. వీరి కుటుంబానికి 40 ఎకరాల పొలం ఉండటంతో కొంతకాలం వ్యవసాయం చేశారు. నాలుగేండ్ల క్రితం ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనగో వాణిజ్యపరంగా లాభదాయకమైన రంగంవైపు అడుగులు వేశారు. శాస్త్రవేత్తల సూచనలు, సొంతంగా పరిశోధనలు చేసి స్పైరునిలా పౌడర్ తయారీ ఫాం ఏర్పాటు చేశారు.
సముద్రపు నీటిని నిల్వచేసినప్పుడు ఏర్పడే నాచుతో తయారయ్యే స్పైరునిలా ఫాంను గత ఏడాది రెండెకరాల పొలంలో ఏర్పాటు చేశాడు. ప్లాస్టిక్ కవర్ సాయంతో ఒక్కో ట్యాంక్లో 77 వేల లీటర్ల నీటి సామర్థ్యంతో, 10 నీటితొట్లను సిద్ధం చేశాడు. వీటిలో సముద్రం నుంచి తెచ్చిన మదర్ కల్చర్ (ఘణ పదార్థం) నీటిని ఈ ట్యాంకుల్లో నింపారు. ఆ ట్యాంకుల్లో 20 నుంచి 25 రోజుల్లోపు నాచు తయారవుతుంది. ఈ నాచు నీటిని మోటర్ ద్వారా పంపింగ్ చేసి హార్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఫిల్టర్ అయి పేస్ట్ రూపంలో సేమియాను తలపించేలా నాచు పదార్థం బయటకు వస్తుంది. దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లోని ట్రేలపైన ఉంచి రెండు రోజులు ఆరబెడతారు. అది ఎండిన తర్వాత ఫాంలోనే మిషన్తో పొడి చేస్తారు. ఇలా తయారైన పొడిని స్పైరునిలా(ఆల్గే) పౌడర్గా మార్కెట్లోకి విడుదల చేస్తారు.
మదన్మోహన్రావు ఏర్పాటుచేసిన ఫాంలో ఇప్పటివరకు స్వచ్ఛమైన పద్ధతిలో 8 క్వింటాళ్ల ఆల్గే పౌడర్ను ఉత్పత్తి చేశారు. నాచు పదార్థం అభివృద్ధి కోసం సోడా కార్బ్, ఫాస్ఫరేట్ సల్ఫేట్ను ఉపయోగిస్తారు. క్రమంగా పదిరోజుల్లోపు ట్యాంకుల్లోని నీళ్ల రంగు ఆకుపచ్చ, నీలం రంగులోకి మారుతాయి. 50 కేజీల సోడా కార్బ్ బస్తా నాలుగు రోజుల వరకు ఉపయోగపడుతుంది. ఈ ట్యాంకుల్లో ప్రత్యేకంగా మైక్రోస్కోప్ ద్వారా చూస్తేనే స్పైరల్స్ కనిపిస్తాయి. ఈ నాచు ద్వారా తయారైన పొడికి మార్కెట్లో కిలో వెయ్యి చొప్పున ధర పలుతుకుంది.
ఈ ఆల్గే పౌడర్లో అనేక పోషక విలువలుంటాయని మదన్మోహన్ తెలిపారు. ఏ మాంసంలోనూ లేనన్ని ప్రొటీన్స్, అనేక మాంసకృత్తులు ఉన్నట్టు అమెరికన్ అగ్రికల్చర్ అధికారులు గుర్తించారు. 100 గ్రాముల ఆల్గే పౌడర్లో 57 శాతం మాంసకృత్తులు ఉంటే, ఇంకా కార్బోహైడ్రేట్స్ 24 శాతం, ఫ్యాట్ 8 శాతం, ఐరన్ 29 శాతం ఉన్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పౌడర్ మనిషి శరీరంలోని రో నిరోధక వ్యవస్థకు తిరుగులేని ఔషధంగా పని చేస్తుంది. నీటిలో కలుపుకొని తాగవచ్చని తెలిపారు.
మా ఫాంలో ప్రతినెలా రూ.10 లక్షల విలువైన ఆల్గే పౌడర్ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ట్యాంకుల్లో ఇప్పటివరకు నాలుగింటిలోనే పని మొదలుపెట్టాం. ప్రస్తుతం కంటికి కనిపించని రీతిలో చిన్నపాటి సూక్ష్మక్రిములు రావడంతో ట్యాంకులను ఆరబెట్టాం. లోపాలను అధిగమించి ఒకేసారి 8 ట్యాంకులను సిద్ధం చేసి అనుకున్న మేర లక్ష్యం సాధిస్తాను. ఫాం ఏర్పాటుకు దాదాపు రూ.50 లక్షల వరకు ఖర్చు అయ్యింది. ఫాం అంతా ప్రొఫెషనల్గా ఏర్పాటు చేశాం. అనుకున్నట్లు సజావుగా జరిగితే ఫౌడర్తో ఎన్నో లాభాలున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వమే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతోపాటు విద్యార్థులకు ఆల్గే పౌడర్ గుళికలను అందజేస్తున్నది. మెడిసిన్, ఆహార పదార్థాల తయారీలోనూ.. ఈ పౌడర్ను వినియోగిస్తారు. స్థానికంగానే కాకుండా విదేశాలకు విక్రయించాలనే లక్ష్యం ఉన్నది.
– మదన్మోహన్రావు