హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ పేరుతో మహారాష్ట్రలో అడుగుపెట్టి సంచలనం రేపిన భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) ‘మహా’గడ్డపై ద్విముఖ వ్యూహంతో దూసుకుపోతున్నది. ఓవైపు తెలంగాణ మాడల్ కోసం రైతు ఉద్యమజోరు, మరోవైపు సామాజిక అంశాలపై పోరు చేస్తూ అన్నివర్గాల ఆదరణ చూరగొంటున్నది. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచటం వంటి డిమాండ్లపై బీఆర్ఎస్తో షేత్కరీ సంఘటన్ జతకలిసి మహారాష్ట్ర సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మహారాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 25 లక్షల పదాధికారుల నియామకం చేసి, ఈ నెలాఖరు నాటికి మరో 5 లక్షలను జమచేసి మొత్తం 30 లక్షల పదాధికారుల లక్ష్యానికి చేరువలో ఉన్నది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గ సమన్వయకర్త, సహాయ సమన్వయకర్తల నేతృత్వంలో గ్రామస్థాయి నుంచి తాలూకా, నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రధాన కమిటీలు, వాటికి అనుబంధంగా ఉండే కిసాన్, యువ, విద్యార్థి, మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, శ్రామిక సహా 9 కమిటీలను బీఆర్ఎస్ విజయవంతంగా పూర్తిచేసింది. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో తెలంగాణ మాడల్ గ్రామగ్రామాన విస్తృత ప్రచారం, అవగాహన కల్పిస్తున్నారు.
ఈ క్రమంలో మహారాష్ట్రలోని ఆరు ప్రాంతీయ కేంద్రాలు, వాటి పరిధిలోని జిల్లాల్లో నెలకొన్న వివిధ సామాజిక అంశాలపై బీఆర్ఎస్ రూపొందించిన ఉద్యమ కార్యాచరణ అమలు అక్కడి ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తున్నది. గులాబీదళం సృష్టిస్తున్న ప్రకంపనలకు మహారాష్ట్ర రాజకీయ పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తమకు ఎదురేలేదని మహారాష్ట్రలో విర్రవీగిన ఎన్సీపీ, శివసేన, శివసేన 2 (ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీ), కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీల నుంచి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్తు చైర్మన్లు, జడ్పీటీసీలు, సర్పంచ్లు వందలాది మంది ప్రజాబలానికి, డిమాండ్కు అనుగుణంగా గులాబీ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే.
ప్రజా ఆకాంక్షలతో మమేకం
మహారాష్ట్రలో రైతు డిమాండ్ల సాధనే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ ఇతర ప్రజా ఆకాంక్షలను అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నది. తాజాగా విద్యార్థులు, యువకులు, మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా గులాబీ పార్టీ శ్రేణులు ఎక్కడిక్కడ ప్రజా ఉద్యమాలతో మమేకమవుతున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలపై ధనుంజయ్ వాంఖడే, దీపక్ కొంపెల్వార్ సారథ్యంలో యావత్మాల్ జిల్లా ఆజాద్ మైదానంలో నాలుగైదు రోజులుగా నిరసనదీక్ష కొనసాగుతున్నది. ‘కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ వ్యవస్థ’ రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్పై బీఆర్ఎస్ మహారాష్ట్ర విభాగం సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించటమే కాకుండా ఆ రాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం, యావత్మాల్ జిల్లా సమన్వయకర్త నానబ్గడ్ బైల్ , పశ్చిమ విదర్భ బీఆర్ఎస్ ఆర్గనైజర్ నిఖిల్ దేశ్ముఖ్, డిప్యూటీ కో-ఆర్డినేటర్ సుభాష్రాథోడ్ సహా మహారాష్ట్రలోని ఆరు ప్రాంతీయ మండళ్ల సమన్వయకర్తల సంతకాలతో ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు లేఖ రాశారు.
యావత్మాల్ జిల్లాలో రాజుకొన్న ఉద్యమం రాష్ట్రమంతటా విస్తరించకముందే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ వ్యవస్థను రద్దు చేయాలని బీఆర్ఎస్ అల్టిమేటం జారీ చేసింది. మరోవైపు పశ్చిమ విదర్భ కో-ఆర్డినేటర్ డాక్టర్ సుభాష్ రాథోడ్ ఆధ్వర్యంలో యావత్మాల్ జిల్లా వాశిం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల గుండాసాగే సామాజిక చైతన్య యాత్రను పోహ్రాదేవి ఆలయం నుంచి మాణిక్ కదం శుక్రవారం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ రూపొందించిన కార్యాచరణకు మహారాష్ట్ర రాజకీయ పార్టీలు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటే.. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తమ ఆకాంక్షలకు ప్రతిరూపంగా భావిస్తున్నారని మాణిక్కదం ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ కోసం డిమాండ్ చేయని రైతు లేడని, రైతులతోపాటు అన్ని వర్గాలు తమతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్న క్రమంలోనే తాము వివిధ సమస్యలపై వివిధ రూపాల్లో మహా సర్కారుపై ఒత్తిడి తెస్తున్నామని పేర్కొన్నారు.